తెలుగుదేశం ప్రభుత్వం 295 హామీలు అమలు చేసింది: సీఎం చంద్రబాబు

  • ఇచ్చిన హామీల కన్నా అధికంగా నెరవేర్చాం
  • నిర్దిష్ట ఆలోచనతో ముందుకెళ్తే ఏదైనా సాధించగల్గుతాం
  • 2029 నాటికి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలి
తెలుగుదేశం ప్రభుత్వం 295  హామీలు అమలు చేసిందని, ఇచ్చిన హామీల కన్నా అధికంగా నెరవేర్చామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజన్ 2029 డాక్యుమెంట్ ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 2022 నాటికి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలనేది, 2029 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఏపీ ఉండాలనేది తమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

 నిర్దిష్ట ఆలోచనతో ముందుకెళ్తే ఏదైనా సాధించగల్గుతామని, తాను తొలిసారి సీఎం అయినపుడే విజన్ 2020 తీసుకొచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. విజన్ 2020 వల్ల హైదరాబాద్ లో అద్భుత అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. ఏపీలో కుటుంబ వికాసం, సమాజ వికాసం, సుస్థిర వృద్ధికి కృషి చేస్తున్నామని, ‘హ్యాపీనెస్’ గురించి మాట్లాడుతున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు.

రైతులకు రూ.1.5 లక్షలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదని, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేల కోట్లు కేటాయించామని, వృద్ధులు, వితంతువులను పూర్తిగా ఆదుకుంటున్నామని అన్నారు. ఆటోలపై జీవితకాల పన్ను, ట్రాక్టర్లపై త్రైమాసిక పన్ను మినహాయించామని, గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించామని, ఏలేరు ఆయకట్టుకు నీటి సమస్య లేకుండా చేశామని వివరించారు. కేంద్రం సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామని, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Telugudesam
Andhra Pradesh
2029 vision document

More Telugu News